
ఢిల్లీ 19డిసెంబర్ (హి.స.) గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైనవారికి ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ (వీబీ-జీ రామ్ జీ) బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. గురువారం సాయంత్రం లోక్సభ ఆమోదించి, కొన్ని గంటల్లోనే పంపిన బిల్లుకు ఎగువసభ అర్ధరాత్రి సమయంలో మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఆ తర్వాత వాయిదా పడింది. సుదీర్ఘంగా సభ కొనసాగడం విశేషం. తగినంత సమయం ఇవ్వకుండా హడావుడిగా బిల్లులకు ఆమోదం తెలపడం అప్రజాస్వామికమంటూ విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. అర్ధరాత్రి 12.40 సమయంలో సంవిధాన్ సదన్ వెలుపల ధర్నాకు దిగాయి. రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (ఎంజీనరేగా) చట్టాన్ని రద్దుచేసి దీనిని తీసుకురావడంపై విపక్షాలు ఉభయసభల్లోనూ మరోసారి నిరసన తెలిపాయి. లోక్సభలో స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి బిల్లు ప్రతుల్ని చించి విసిరేశాయి. బిల్లు ఆమోదం పొందిన తర్వాత సభ శుక్రవారానికి వాయిదా పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ