అమరావతి, 12 జూన్ (హి.స.)
: గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లటిపొగ అన్ని వైపులకు వ్యాపించింది. మధ్యాహ్నం 1.39 సమయంలో చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అప్పటికి విమానం 825 అడుగుల ఎత్తులో ఉంది.
ప్రమాదానికి గురైన విమానం వైడ్బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీ ఉండటంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమాన కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజిన్లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఆ విమానంలో ఉన్నట్లు ఏబీపీ పత్రిక పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ