
దిల్లీ:, 12 జూన్ (హి.స.) కొవిడ్-19 వ్యాధిని కలిగించే సార్స్కోవ్-2 వైరస్ సహజ పరిణామమే కొత్త ఎక్స్.ఎఫ్.జి. వేరియంట్ అనీ, దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలే తప్ప భయాందోళన చెందరాదని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ భరోసా ఇచ్చారు. భారత్లో ఇంతవరకు 206 ఎక్స్.ఎఫ్.జి. కేసులు నమోదుకాగా, వాటిలో అత్యధికంగా 89 కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. ఎక్స్.ఎఫ్.జి. ఇంకా తీవ్ర రూపుదాల్చలేదు. ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ద్వారా ఈ కొత్త వేరియంట్ను గుర్తించవచ్చని డాక్టర్ భార్గవ వివరించారు. దేశంలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 11 వరకు సాధారణ కొవిడ్-19 కేసులు 7,000కు పైగా నమోదయ్యాయి. 74 మరణాలు సంభవించాయి. ఈ కేసులు తీవ్రమైనవి కాకపోయినా ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, ఐసీయూ పడకలు, మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు వెళ్లాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు