అమరావతి, 13 జూన్ (హి.స.)
కర్నూలు: జిల్లాలో దొంగలు) మరోసారి రెచ్చిపోయారు. తాళం వేసిన ఇళ్లల్లో దోపిడీ చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. అందిన కాడికి దోచుకుని ఉడాయిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో భారీ చోరీ జరిగింది. వజ్రాల వ్యాపారస్తుడు పార్థసారథి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి 30 తులాల బంగారు, వెండి ఆభరణాలు, రూ. 5 లక్షల నగదు అపహరించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రాల వ్యాపారస్తుడు పార్థసారథి తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లాడు. దర్శనం పూర్తి అయిన తర్వాత తన ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో ఇంట్లోని వస్తువులు చిందర వందరగా పడేసి ఉన్నాయి. అనుమానం వచ్చి ఇంట్లోని బీరువాను పరిశీలించాడు. బీరువా తలుపులు పగులగొట్టి అందులో ఉన్న విలువైన 30 తులాల బంగారు, వెండి ఆభరణాలు, రూ. 5 లక్షల నగదు మాయం అయ్యాయి. దీంతో వెంటనే పోలీసులకు వజ్రాల వ్యాపారస్తుడు పార్థసారథి ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు ఎంతో వ్యూహాత్మకంగా ఈ చోరీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని దొంగలు అంచనా వేసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. రోజురోజుకూ దొంగతనాలు పెరిగిపోతున్నప్పటికీ, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ చోరీకి ముందు కూడా తుగ్గలి మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో దొంగతనాలు జరిగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ