హైదరాబాద్, 24 జూన్ (హి.స.)
, : రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం(2025-26)లో ఇంజినీరింగ్తోపాటు అన్ని ఉన్నత విద్య కోర్సులకు పాత ఫీజులే అమలుకానున్నాయి. ఎప్సెట్ సహా లాసెట్, ఐసెట్, ఎడ్సెట్, పీజీఈసెట్, పీఈసెట్ల కౌన్సెలింగ్ గత ఏడాది ఫీజులతోనే నిర్వహించనున్నారు. దీన్నిబట్టి బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, బీపీఎడ్, డీపీఎడ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు పాత రుసుములే వర్తించనున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వర్గాల సమాచారం.
ఇంజినీరింగ్లో ఫీజులు భారీగా పెరుగుతుండటంపై సీఎం రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేయడం, రుసుములు ఖరారుచేసే ముందు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ఓ కమిటీని నియమించి ఇతర రాష్ట్రాల్లో ఫీజుల విధానంపైనా అధ్యయనం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ వ్యవహారం ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడంతో.. ప్రవేశాల కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా పాత ఫీజుల ప్రకారమే (ఇంజినీరింగ్లో గరిష్ఠ ఫీజు రూ.1.65 లక్షలు) తొలుత ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రకారం..షెడ్యూల్ను మంగళవారం లేదా బుధవారం ఖరారుచేసి విడుదల చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. అలాగే పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన వారు ఈసెట్ ద్వారా నేరుగా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాది కోర్సుల్లో చేరనున్నారు. ఆ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీలోపు తొలి విడత సీట్లు కేటాయిస్తారు. వారు ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు పొందుతున్నందున ఆ విద్యార్థులకు కూడా నిబంధనల ప్రకారం పాత ఫీజులే వర్తించనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ