అమరావతి, 24 జూన్ (హి.స.)రెంటపాళ్ల పర్యటన సందర్భంగా కారు ప్రమాదంలో వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందిన కేసులో తనను నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో తనకున్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో లోపాలున్నాయనే అంశాన్ని మాజీ సీఎం జగన్ మళ్లీ తెరపైకి తెచ్చారు.
తన భద్రతపై సీఎం చంద్రబాబుని ప్రశ్నిస్తూ జగన్ ట్వీట్ చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది తనకు ఆటోమేటిక్ హక్కు అని.. మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అని జగన్ ప్రశ్నించారు.
జడ్ప్లస్ సెక్యూరిటీ ఉన్న తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్మ్యాప్ ఇచ్చిన తర్వాత, పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడుతన వాహనం చుట్టూ రోప్పట్టుకుని, ఎవ్వరూ వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? అని ప్రశ్నించారు. రోప్ పార్టీలు ఉంటే సింగయ్య మరణం సంభవించేది కాదని జగన్ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.
కాగా.. జగన్కి భద్రత కల్పించడంలో పోలీసులు తరచూ విఫలమవుతున్నారని.. రెంటపాళ్ల పర్యటనలోనూ ఈ వైఫల్యం స్పష్టంగా కనిపించిందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్య నారాయణ అన్నారు. జగన్కి ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించి ఉంటే సింగయ్యకు ప్రమాదం జరిగినప్పడు పోలీసులు ఎక్కడ ఉన్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు బొత్స.
జగన్కు జెడ్ ప్లస్ కేటగిరీ కంటే ఎక్కువ భద్రత ఇచ్చామని.. రెంటపాళ్ల పర్యటనలో జగన్, వైసీపీ నేతలు పోలీసుల రూల్స్ ఎందుకు ఫాలో అవ్వలేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు.
మొత్తానికి తన భద్రతపై జగన్ నోట మళ్లీ జెడ్ ప్లస్ కేటగిరీ మాట రావడం దానికి టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి