హైదరాబాద్, 25 జూన్ (హి.స.)బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ గారు ముఖ్యాంశాలు:
****
అలహాబాద్ హైకోర్టు న్యాయపూర్వక తీర్పు ద్వారా ఇందిరాగాంధీ ఎంపీగా అర్హత లేదని తేల్చగా, ఆ తీర్పును వ్యతిరేకిస్తూ తన పదవిని కాపాడుకోవడానికి, రాజ్యాంగ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకునేలా.. నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యంత దారుణంగా దేశమంతటా ఎమర్జెన్సీని విధించారు.
రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఇందిరా గాంధీ గారు పదవీ వ్యామోహంతో ప్రతిపక్షాలను అణచివేయాలనే లక్ష్యంతో నియంతపాలనకు పాల్పడ్డారు. ఆమె విధించిన ఎమర్జెన్సీ గురించి ఈ తరం ప్రజలకు తప్పకుండా తెలియజేయాల్సిన చీకటి అధ్యాయం.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ఇటుత తెలంగాణలోనూ బిజెపి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా ఆ చీకటి రోజుల గురించి ప్రజలకు వివరించడం జరుగుతోంది.
ఎమర్జెన్సీ విధానాల ద్వారా కాంగ్రెస్ పార్టీ పత్రికా స్వేచ్ఛను, ప్రజల హక్కులను, ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. ప్రతిపక్షాలను అణచివేసి, తమ కుటుంబం మాత్రమే అధికారంలో ఉండాలని ఉద్ధేశ్యంతో నిరంకుశంగా వ్యవహరించింది.
మీసా చట్టం కింద అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, జయప్రకాశ్ నారాయణ్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు వంటి ప్రముఖ నేతలను జైలులో నిర్బంధించారు. వారు నిత్యావసర సౌకర్యాలు లేని పరిస్థితుల్లో చిత్రహింసలు భరించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి నుంచీ దత్తాత్రేయ గారు, వెంకయ్య నాయుడు గారు, జంగారెడ్డి గారు, ఇంద్రసేనా రెడ్డి గారు, చలపతిరావు గారు వంటి అనేకమంది ఉద్యమకారులు, కార్యకర్తలు మీసా చట్టం కింద జైళ్లకు వెళ్లారు.
కాంగ్రెస్ పార్టీలో కమలాపతి త్రిపాఠి గారు, ఎన్డీ తివారి గారు వంటి పలువురు జాతీయ స్థాయి నేతలు ఉన్నా, మన రాష్ట్రానికి చెందిన పీవీ నరసింహారావు గారు, జలగం వెంగల్రావు గారు, చెన్నారెడ్డి గారు, నీలం సంజీవరెడ్డి గారు వంటి నాయకుల సూచనలను కూడా పక్కన పెట్టి, ఎమర్జెన్సీ విధించిన తీరు అత్యంత బాధాకరం.
పత్రికా స్వేచ్ఛను అణిచివేసి, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఏకపక్షంగా నడిపిన ఆ వ్యవహారం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచింది.
ఆనాడు రాజనాథ్ సింగ్ గారిని కూడా జైలుపాలు చేశారు. ఆ సమయంలో ఆయన తల్లి మరణించినప్పటికీ, అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు.
దాదాపు 21 నెలల పాటు ఈ దేశంలో ఎటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా, ప్రజల అసలు సమస్యలను పక్కన పెట్టి, కేవలం తన అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఇందిరాగాంధీ.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. తన పాలనను విమర్శించే ప్రతీ గొంతును అణచివేయడమే కాక, వారిని జాతీయ వ్యతిరేకులుగా ముద్ర వేయడం తత్వంగా మారిపోయింది.
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఆ దారుణ చరిత్రపై ప్రజలకు ఏ సమాధానం ఇస్తారు?
ఆ సమయంలో నరేంద్ర మోదీ గారు కేవలం ఒక సామాన్య కార్యకర్త. ఆయనలాగే లక్షలాది కార్యకర్తలు, జనసంఘ్, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు.
ఎమర్జెన్సీ కాలంలో రాత్రికి రాత్రి కరపత్రాలు ముద్రించి, గల్లీ నుంచి గ్రామం వరకు ప్రతి వ్యక్తికి ప్రజాస్వామ్యంపై, పత్రికా స్వేచ్ఛపై, రాజ్యాంగంపై జరిగిన దాడిని ప్రజలకు తెలియజేశారు. ఆ కార్యకర్తలపై కూడా మీసా చట్టం అమలుచేశారు.
ఈరోజు వారిలో ఎంతోమంది వయోవృద్ధులుగా జీవిస్తూ, అప్పటి చిత్రహింసలు గుర్తుచేసుకుంటూ బాధపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా గాంధీ కుటుంబానికి ఒకే ఒక ఉద్దేశం.. ఐ, మీ, మై సెల్ఫ్ సిండ్రోమ్. అంటే నేను, నా కుటుంబం, మా కుటుంబం తప్ప మరేమీ కనిపించదు. దేశ ప్రజల అభిప్రాయం, ప్రజాస్వామ్య విధానాలు, రాజ్యాంగం అన్నీ పక్కన పెట్టే ధోరణి వారి నుంచి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంది.
ఇందుకు స్పష్టమైన ఉదాహరణ.. మూడోసారి మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల తీర్పును విస్మరించి, ప్రజాస్వామ్య సంక్షోభం అని మాట్లాడుతున్నారు.
రాహుల్ గాంధీ గారు ఎప్పుడూ రాజ్యాంగ పుస్తకం పట్టుకుని ప్రజాస్వామ్యం ఖతమైపోయింది అంటారు. కానీ, ఎమర్జెన్సీ విధించిన తీరు గురించి సమర్థించాలా? వ్యతిరేకించాలా? అనే విషయంపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి.
ఈ రోజు కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్.. మోదీ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ విధించింది అంటూ విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
నిజంగా ఎమర్జెన్సీ విధిస్తే, జైరాం రమేష్ వంటి నాయకులు పత్రికా సమావేశాల్లో మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. మోదీజీ అలా ఎప్పుడూ చేయలేదు. పత్రికా స్వేచ్ఛకు గౌరవం ఇస్తూ, ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు ఉందని స్పష్టంగా చెబుతున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలనే దృఢ సంకల్పంతో మోదీ గారు ముందుకు పోతున్నారు.
ఎమర్జెన్సీ రోజులను చీకటి అధ్యాయంగా, రాజ్యాంగ హత్యా దినంగా గా పరిగణిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జూన్ 25న ఈ చీకటి రోజుల గురించి ప్రజలకు, భావితరాలకు తెలియజేసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
అందుకే జూన్ 25, 26, 27 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫోటో ఎగ్జిబిషన్లు నిర్వహించి, గ్రామాల వరకు ఈ దారుణ చరిత్రను తెలియజేసే కార్యక్రమాలు జరుగుతాయి.
మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు జస్టిస్ మాధవి దేవి గారి తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది.
బిజెపి ఎప్పటి నుంచో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ చేస్తోంది. ఫిబ్రవరి 1, 2024 నుండి రాష్ట్రంలోని పలు గ్రామపంచాయతీల్లో సర్పంచ్లు లేరు. గత ఆరు నెలలుగా ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఎవరు గెలిచినా స.. కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులు ప్రజలకు చేరే అవకాశం ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గత రెండు సంవత్సరాలుగా సర్పంచ్లకు రావాల్సిన బడ్జెట్ నిలిచిపోయింది. ఇప్పటికీ రాష్ట్రంలోని పంచాయతీలకు దాదాపు రూ.2,500 కోట్లు రావాల్సిన అవసరం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరపడం లేదు? సర్పంచ్లు లేకుండా గ్రామాభివృద్ధి ఎలా సాధ్యం? ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నిధులు లేకుండా ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతాయి? సమాధానం చెప్పాలి.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని మనం గర్వంగా చెప్పుకుంటాం. ఓటు హక్కు అనేది ప్రతి ఒక్క పౌరుడికీ రాజ్యాంగం ద్వారా లభించిన విలువైన హక్కు. ఆ అభిప్రాయానికి అనుగుణంగా ఓటు వేయడం ద్వారా గ్రామ, మండల అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వచ్చిన హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టే. గతంలో తరచూ కోర్టుల తీర్పులను ధిక్కరిస్తూ.. వాయిదాలు వేయడమే రాష్ట్ర ప్రభుత్వ నైజంగా కనిపించింది. కానీ ఇకనైనా కోర్టు స్పష్టంగా ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
ఎన్నికలు జరిపించకుండా కేంద్రాన్ని నిందించడం... అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.
రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో గ్యారెంటీలు, హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొత్త పాలన తీసుకొస్తామని, గ్యారెంటీ స్కీమ్స్ అమలు చేస్తామంటూ ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక అసలైన పరిస్థితేంటో బయటపడింది.
లంకె బిందెలు ఉన్నాయనుకుని వస్తే ఖాళీబిందెలే ఉన్నాయి. అప్పులే తప్ప మిగిలిందేమీ లేదు అంటూ రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు ప్రజలను అవమానపరచడమే.
ఎక్కడికి వెళ్లినా డబ్బులు రావడం లేదు, ఎవ్వరూ అప్పు ఇవ్వడం లేదంటూ.. ఇలాంటి మాటలు చెప్పేది పాలకులు ఎలా అవుతారు? ఓటమికి భయపడే నాయకుడే కదా..! ఇది రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమే. ప్రజలు చూస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు.
ఇది పూర్తిగా కీలుబొమ్మల ప్రభుత్వమని ప్రజలు ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనే ప్రధాన మంత్రిత్వ శాఖలన్నీ ఉండడంతో మంత్రులకు అధికారాలే లేవు. మంత్రులకు గౌరవం లేదు, స్వతంత్రత లేదు. అధికారులూ మంత్రుల మాట వినడంలేదు. ఇలాంటి విచిత్ర పాలన దేశంలో మరెక్కడా లేదు.
ఈ పరిస్థితుల్లో మంత్రులు సీఎం మాట వినడంలేదు. అధికారులు మంత్రుల మాట వినడంలేదు. ప్రజలు ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్తే వారు ఏం చేయాలి? హామీలు నెరవేర్చలేకపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవే మూల కారణాలు.
ఇదే కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేస్తోంది. ఎందుకంటే, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీకి భయం.
సంస్థాగతంగానూ భారతీయ జనతా పార్టీకి బలంగా ఉంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసింది. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ ఎన్నికలైనా.. బిజెపి గెలుస్తుందనే నిజాన్ని కాంగ్రెస్ అంగీకరించలేకపోతోంది.
ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టులాంటిదే. మూడు నెలల లోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టంగా ఆదేశించింది. దీనిని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది.
రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా సరే.. అది బైఎలక్షన్స్ అయినా, స్థానిక సంస్థల ఎన్నికలైనా, భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది.
హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల్లోపే పూర్తిచేయాలి అని చెప్పిన నేపథ్యంలో భవిష్యత్తులో హైకోర్టు జడ్జిమెంట్ను గాలికొదిలేసే ప్రయత్నాలు చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రజలకు నిధులు చేరాలి, నిధులు చేరాలంటే ప్రజా ప్రతినిధులు అవసరం, ప్రతినిధులుంటేనే సమగ్ర పాలన సాధ్యం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు