హైదరాబాద్, 25 జూన్ (హి.స.) రైల్వే
ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో కొత్తతరం మైన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైళ్లను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ వివరించారు. 16 నుంచి 20 కోచ్లు ఉండే మెము రైళ్లను వచ్చే 2026 మే నుంచి తెలంగాణలోని కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. ఈ మెము రైళ్లు, గ్రామీణ ప్రాంతాలు, సెమీ-అర్బన్ ప్రాంతాలను అనుసంధానించడంలో మరీ ముఖ్యంగా పండగల సమయంలో ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఈ సందర్భంగా రైల్వేమంత్రి స్పష్టం చేశారు. రూ.716 కోట్లతో కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని 2026 జనవరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తాందన్నారు. మే 2026 నుంచి ఈ కేంద్రం ద్వారా ఉత్పత్తి ప్రారంభం కానుందని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..