హైదరాబాద్, 25 జూన్ (హి.స.)
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్
నాయకుడు వి. హనుమంత రావు హైదరాబాద్లోని హైటెక్ సిటీలో కో-లివింగ్(Co-Living) స్పేస్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేడు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. వీటిని నియంత్రించాలని సీఎం రేవంత్ రెడ్డిని మరియు మంత్రి శ్రీధర్ బాబును కోరారు. ఒకే హాస్టల్లో యువతీ యువకులు కలిసి ఉండటం సమాజంలో అనైతిక ప్రవర్తనకు దారితీస్తోందని హెచ్చరించారు. హైదరాబాద్ను నెంబర్ వన్ సిటీగా నిలబెట్టాలంటే ఇటువంటి ప్రవృత్తిని కట్టడి చేయాలని, ఇలాంటి వ్యవహారాలపై NSUI విద్యార్థి సంఘం దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో ఫ్యాక్షన్ హత్యలు ఉండగా, ఇప్పుడు లవ్ మర్డర్స్ పెరిగాయని అన్నారు.
సొంత భర్తను, తల్లిని కూతురు చంపడం వంటి దారుణ ఘటనలు సమాజం దిగజారుతున్న దిశను సూచిస్తున్నాయని, ఇటువంటి హత్యలను సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని కోరారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..