న్యూఢిల్లీ, 25 జూన్ (హి.స.)
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రంగ
సంస్థలకు కేటాయించిన భూముల విషయంలో సమస్యలను పరిష్కరించేలా కేంద్ర జోక్యం చేసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామిని కలిసి విజ్ఞప్తి చేశారు. 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన కోసం హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను భారీ ఎత్తున రాయితీ ధరలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిందని కేంద్ర మంత్రికి శ్రీధర్ వివరించారు. కాలక్రమంలో వాటిలో చాలా సంస్థలు మూతపడ్డాయని... పూర్తిగా ఉత్పత్తి నిలిపేశాయని తెలిపారు. వాటి పరిధిలోని విస్తీర్ణ భూములు ప్రస్తుతానికి నిరుపయోగంగా ఉండడమే కాకుండా.. కొన్ని సంస్థలు భూములను వాణిజ్య పరంగా వినియోగానికి మార్పు చేసుకోవాలన్న యత్నాలు చేస్తున్నాయని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..