హైదరాబాద్, 27 జూన్ (హి.స.)
కాంగ్రెస్, బీఆర్ఎస్ ములాఖత్
అయి ప్రజలను ఆగం చేస్తున్నాయని ఇందుకు కాళేశ్వరం కమిషన్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ విచారణ నిదర్శనం అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నామమాత్రపు విచారణ చేపడుతున్నారని ఇందులో తప్పు చేసిన ఒకడిని అరెస్టు చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులను సిట్ ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేని కాంగ్రెస్ నాయకులను సిట్ విచారణకు పిలుస్తోందని దుయ్యబట్టారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తన ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను నా కుటుంబ సభ్యులను హరాస్మెంట్ చేశారు. ఈ విషయంలో నేను పదిసార్లు నాటి డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు. నేను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా నన్ను ఎందుకు పిలవడం లేదు? అని ప్రశ్నించారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫిస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రొజుకు ఒక్కరిని మాత్రమే విచారణ చేయడానికి ఇదేమైనా డైలీ సీరియలా అని ప్రశ్నించారు. ఆధారాలను ఇచ్చే వాళ్లను పక్కన పెట్టి డైలీ సీరియల్ నడుపుతూ టైమ్ పాస్ చేస్తున్నారని ఇదేమైనా గాంధీ భవన్, తెలంగాణ భవన్ పంచాయతీనా అని విమర్శించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్