విశాఖ, 27 జూన్ (హి.స.)
చిట్టీ పేరుతో వందలాదిని మంది ఓ మహిళ మోసం చేసింది. బాధితులంతా గురువారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌడువాడ శివారు గరుగుబిల్లికి చెందిన పెదిరెడ్ల పద్మజ అలియాస్ చల్లపల్లి పద్మకు సామర్లకోటకు చెందిన శ్రీనుతో వివాహమైంది. వీరికి కుమారుడు సాయి ఉన్నాడు. 15 ఏళ్ల కిందట చౌడువాడ వచ్చి స్థిరపడ్డారు. భర్త చనిపోవడంతో కొన్నాళ్లపాటు అనకాపల్లిలో ఉన్నారు. అక్కడ ఉంటూనే చౌడువాడ గ్రామస్థులతో పరిచయాలు పెంచుకుని పప్పుల చీటీలు, వరలక్ష్మి వ్రతం పేరుతో బంగారు కాసుల చీటీలను ప్రారంభించారు. అనంతరం రూ. లక్ష నుంచి రూ.20 లక్షల వరకు చిట్టీలు వేశారు. నమ్మకం కలిగిన వారంతా చిట్టీలు పాడిన మొత్తాన్ని వడ్డీకి ఆమెకే ఇచ్చేవారు. ఇలా రూ. 5 కోట్లు వసూలు చేసి వారం రోజుల కిందట ఆరోగ్యం బాగోలేదని కుమారుడితో ఇంటి నుంచి వెళ్లిన పద్మజ తిరిగి రాలేదు. వారు వెళ్లిన రెండో రోజుల వరకు ఫోను పనిచేసింది. ఆ తర్వాత నుంచి స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో సర్పంచి ఎరుకునాయుడు, విశాఖ డెయిరీ డైరెక్టర్ సుందరపు గంగాధర్ తదితరులతో కలిసి బాధితులు కె.కోటపాడు ఎస్సై ధనుంజయ్కు ఫిర్యాదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ