తెలంగాణ, సంగారెడ్డి. 27 జూన్ (హి.స.)
ఆటో కార్మికుల కోసం బీఆర్ఎస్ పార్టీ
పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పటాన్చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం హరీష్ రావును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవితాలు దయనీయంగా మారాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి తమను మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడాలని వారు కోరారు.
ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. అవి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని మండపడ్డారు. ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు