మహబూబ్నగర్, 3 జూన్ (హి.స.)
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.
బాలానగర్ మండలం కేతెరెడ్డిపల్లి, రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామాలలో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్