అమరావతి, 3 జూన్ (హి.స.)
కదిరి పట్టణం, : కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే అర్ధరాత్రి దొంగలు పడ్డారు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.లక్ష అపహరించుకెళ్లారు. ఇంటి యజమానులు తెలిపిన మేరకు వివరాలు. కదిరిలోని జడ్జి బంగ్లా వెనుక భాగాన ఉన్న వైశ్యకాలనీలో ప్రభుత్వ అధ్యాపకురాలు కవిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటశివ దంపతులు నివాసం ఉంటున్నారు. మూడు పడక గదులున్న ఇల్లు కావడంతో ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు వేర్వేరు గదుల్లో నిద్రించారు. అయితే సొత్తు ఉంచిన గదిలో ఎవరూ పడుకోలేదు. దొంగలు అర్ధరాత్రి దాటిన తరువాత ఆ గది కిటికీ కడ్డీలు కోసి లోపలికి ప్రవేశించారు. గదిలోకి ఎవరూ రాకుండా ఉండేలా గడియ బిగించారు. బీరువాలోని పది తులాల బంగారు ఆభరణాలు, సుమారు 4 కిలోల వెండి వస్తువులతో పాటు రూ.లక్ష ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున ఆ దంపతుల కుమార్తె ఆ గది లోపలి వైపున గడియ వేసి ఉండటాన్ని గుర్తించి తల్లిదండ్రులకు చెప్పింది. వారు పరిశీలించగా గది బయటవైపు కిటికీ కడ్డీలు కోసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కదిరి అర్బన్ సీఐ నారాయణరెడ్డి, సిబ్బందితో పాటువెళ్లి చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, ఉన్నతాధికారులకు తెలిపారు. క్లూస్టీమ్, డాగ్స్క్వాడ్ చోరీ జరిగిన గదిని పరిశీలించి ఆధారాలను సేకరించారు. ఇంటి యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ