ముంబయి: , 30 జూన్ (హి.స.)లౌడ్ స్పీకర్ల శబ్ద పరిమితిపై ఆంక్షలున్న నేపథ్యంలో ముంబయిలోని కొందరు మసీదుల నిర్వాహకులు సాంకేతికత వైపు అడుగులు వేశారు. ‘అజాన్’ (ప్రార్థన పిలుపు)ను నేరుగా చేరవేసేలా రూపొందిన ప్రత్యేక ‘ఆన్లైన్ అజాన్’ అనే మొబైల్ యాప్తో వారు రిజిస్టరయ్యారు. దీనిని తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన సంస్థ అభివృద్ధి చేసిందని మహిమ్ జుమా మజీద్ మేనేజింగ్ ట్రస్టీ ఫహాద్ ఖలీల్ పఠాన్ ఆదివారం వెల్లడించారు. ‘‘మసీదు చుట్టుపక్కలున్నవారికి ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో.. ఈ అజాన్ యాప్ ద్వారా మత విశ్వాసకులను నేరుగా పిలవవచ్చు. ఆంక్షలు విధించినపుడు, ముఖ్యంగా రంజాన్ మాసంలో ఇంట్లో ఉండి అజాన్ వినేలా ఈ ఉచిత యాప్ను రూపొందించాం. అజాన్ సమయంలో మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షంగా ఆడియోను వినవచ్చు’’ అని ఆయన తెలిపారు. మూడురోజుల్లోనే తమ మసీదుకు సమీపంలోని 500 మంది ఈ యాప్లో నమోదయ్యారని, యాప్ సర్వర్తో ఆరు మసీదులు అనుసంధానమయ్యాయని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు