తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి. 8 జూన్ (హి.స.)
జయశంకర్ భూపాలపల్లి మేడిగడ్డ బ్యారేజీలో నిన్న గల్లంతైన ఆరుగురి యువకుల మృతదేహాలను నేడు వెలికితీశారు. రక్షిత్ (13), సాగర్ (16), మధుసూదన్(18), రామ్ చరణ్(17), శివ మనోజ్(15), రాహుల్ (19) మృతదేహాలను బయటికి తీయించిన పోలీసులు, పోస్ట్ మార్టం కోసం మహాదేవపూర్ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. కాగా మహాదేవపూర్ మండలం అంబట్ పల్లిలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరైన వీరంతా స్నానాలు చేసేందుకు శనివారం సాయంత్రం మేడిగడ్డ బ్యారేజి వద్దకు చేరుకున్నారు.
తొలుత మధుసూదన్ నీటిలో మునిగిపోగా.. అతన్ని రక్షించే క్రమంలో వీరంతా నీటిలో గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సహాయంతో ఆదివారం సాయంత్రం వరకు ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. ఈ విషాద వార్తతో యువకుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు