అమరావతి, 9 జూన్ (హి.స.) రాష్ట్రంలో కోకో రైతుల వద్ద ఉన్న ప్రతి గింజ కొనుగోలు చేయనున్నట్లు ఉద్యానవన శాఖ డైరెక్టర్ కె.శ్రీనివాసులు చెప్పారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన చేస్తూ, వాస్తవ సాగుదారుల నుంచి కోకో దిగుబడులను ఈ నెలాఖరులోపు సేకరించనున్నట్లు తెలిపారు. కిలో రూ.500 చొప్పున రైతుకు ధర చెల్లిస్తే, ప్రభుత్వం రూ.50 చొప్పున కంపెనీలకు రీయింబర్స్మెంట్ చేస్తుందని పేర్కొన్నారు. గోదావరి ప్రాంతంలో ఈ ఏడాది 49,264 ఎకరాల్లో రైతులు కోకో పంట సాగు చేయగా, ఎకరానికి సగటున 3 క్వింటాళ్ల చొప్పున 11,780టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. రైతులు అమ్ముకోగా, గత నెలాఖరుకు 1,620టన్నుల కోకో గింజలు మిగిలినట్లు గుర్తించామని తెలిపారు. వీటి సేకరణకు ప్రభుత్వం అనుమతించిన మాండలేజ్, డీపీ చాక్లేట్స్, ఇతర కంపెనీలు ఇప్పటి వరకు 761 క్వింటాళ్లు కొనుగోలు చేసినందని వెల్లడించారు. మిగిలిన సరుకును ఈ 30వ తేదీలోగా సేకరించాలని టార్గెట్ పెట్టినట్లు ఆయన తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ