అమరావతి, 9 జూన్ (హి.స.) రాష్ట్రప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని 25 జిల్లాల్లో క్రికెట్ మైదానాల నిర్మాణానికి కృషిచేస్తామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన ఏసీఏ 72వ వార్షిక సర్వసభ్య సమావేశానంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రానున్న రెండేళ్లలో ఏసీఏకి సొంత మైదానాలు ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మంచి క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఏపీఎల్ నిర్వహిస్తామని చెప్పారు. విశాఖ స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేసి ఎక్కువ మ్యాచ్లు జరిగేలా, మరిన్ని ఫ్రాంఛైజీలు వచ్చేలా కృషిచేస్తామని తెలిపారు. ఏసీఏ అనుబంధ క్రికెట్ క్లబ్లు కూడా పోటీలు నిర్వహించాలని కోరగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పారు. అన్ని జిల్లా క్రికెట్ సంఘాలు ఏడాదిలో 200 రోజులు మ్యాచ్లు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. రాజధాని ప్రాంతంలో నిర్మించబోయే క్రీడా నగరంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంటుందని చెప్పారు. ఈ విషయమై ఏసీఏ కార్యదర్శి సానా సతీష్, మంత్రి లోకేశ్ సహాయంతో ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐతో ప్రాథమిక చర్చలు జరిగినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ