హైదరాబాద్, 9 జూన్ (హి.స.)
ప్రజాసేవలో మోడీ 3.0కి ఏడాది
పూర్తి అయిందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో ప్రజలను శక్తివంతం చేయడానికి బలమైన ఆత్మనిర్బర్ భారత్ను నిర్మించడానికి సరిగ్గా ఏడాది క్రితం మోడీ 3.0 ప్రయాణాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ఏడాది కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రజలతో, అనేక సంఘాలతో మమేకం అవడం, సమస్యలను పరిష్కరించడం సంతృప్తినిచ్చిందని ప్రకటించారు.
దేశంలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత కోసం భారత ప్రభుత్వం రూపొందించిన విధానాలను అమలు చేసే బాధ్యత నాకు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. మొక్కవోని దీక్షతో, మరింత దృఢ సంకల్పంతో ప్రజా సేవకు అంకితం అవుతానని పునరుద్ఘాటిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం, సాధికారత కోసం నా ప్రయాణం కొనసాగుతుందని పేర్కొన్నారు. సుసంపన్న భారత్ కల నెరవేర్చుకునేందుకు వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి మనమంతా చేతులు కలుపుదామని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..