అమరావతి, 9 జూన్ (హి.స.)రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా భిన్నమైన వాతావరణం నెలకొంటుంది. ఉదయాన్నే భానుడు తీవ్ర ప్రతాపం చూపుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతున్నాయి. ఇక సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
నిన్న(ఆదివారం) సాయంత్రం ఏపీ(Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి. పలు చోట్ల ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో నిన్న అనకాపల్లిలో ఎక్కువగా 5 సెం.మీ వర్షపాతం నమోదైందని పేర్కొంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండలో 2.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇవాళ(సోమవారం) ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు అంచనా వేసింది. బాపట్ల నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే కోస్తాంధ్రలో 41-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి