తిరుమల, 9 జూన్ (హి.స.)తిరుమల లో ఓ వ్యక్తి మద్యం తాగుతూ ఖాళీ బాటిళ్లను మెట్లపై విసిరేస్తున్నాడని ఓ వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ వీడియో పై టీటీడీ తాజాగా స్పందించింది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతున్న ఒక వీడియో(Viral Video)లో మద్యం సేవిస్తున్న వ్యక్తి దృశ్యాలు తిరుమలలో జరిగినదిగా వర్ణిస్తూ పుకార్లు వ్యాప్తి చేస్తున్నట్లుగా టీటీడీ దృష్టికి వచ్చింది. ఆ ప్రచారాన్ని టీటీడీ(TTD) పూర్తిగా ఖండిస్తోంది.
సంబంధిత ఘటన అలిపిరి ప్రారంభంలో అంటే తనిఖీ కేంద్రానికి వచ్చే ముందు ప్రాంతంలో చోటుచేసుకుంది అని టీటీడీ తెలిపింది. ఆ ప్రాంతం తిరుమల పరిధిలోకి రాదు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు ప్రచార యావతో తిరుమలలో అపచారం జరిగిందంటూ ప్రచారం చేయడం మహాపాపం అంటూ టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భక్తులు తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని విజ్ఞప్తి చేసింది. తిరుమల పవిత్రతను దెబ్బతీసే అసత్యాలను ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ హెచ్చరించింది. ఈ మేరకు టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి