దిల్లీ: 6 జూలై (హి.స.) ఐదో ‘శ్రీరామాయణ యాత్ర’ను ఈనెల 25న ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తెలిపింది. 17 రోజుల ఈ రైలు యాత్రలో శ్రీరామచంద్రునితో సంబంధమున్న 30 ప్రదేశాలను భక్తులు సందర్శిస్తారు. ఇది అయోధ్య నుంచి మొదలై నందిగ్రామ్, సీతామఢి, జానక్పుర్, బక్సర్, వారణాసి, ప్రయాగ్రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి, తదితర ప్రదేశాలు మీదుగా సాగి రామేశ్వరంతో ముగుస్తుంది. యాత్ర ప్యాకేజీ ధర(ఒక్కరికి) థర్డ్ ఏసీ- రూ.1,17,975, సెకండ్ ఏసీ- రూ.1,40,120, ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్- రూ.1,66,380, ఫస్ట్ ఏసీ కూపె- రూ.1,79,515. దిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వేస్టేషన్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. త్రీ స్టార్ హోటళ్లలో భోజన, వసతితో పాటు ప్రయాణ బీమా వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ