అహ్మదాబాద్, 12 ఏప్రిల్ (హి.స.) గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ ఆరో అంతస్తులో దట్టమైన పొగతో కూడిన మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో తన ఇద్దరు పిల్లలను రక్షించేందుకు ఓ తల్లి సాహసం చేసింది. బాల్కనీ నుంచి ఇద్దరు పిల్లలను ఒకరి తర్వాత ఒకరిని స్థానికుల సాయంతో కాపాడింది.
తొలుత చిన్న కుమార్తెను గాల్లో వేలాదిస్తూ రక్షించాలని కోరగా.. స్థానికులు ఆమెను కాపాడారు. పెద్ద కుమార్తెనూ అదే విధంగా జార విడిచింది. ఆపై తను కూడా బాల్కనీ నుంచి కిందకు ప్రమాదకరంగా వేలాడుతూ ఇద్దరు వ్యక్తుల సాయంతో ప్రాణాలు కాపాడుకోగలిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని 20 మంది అపార్ట్మెంట్ వాసులను రక్షించారు. తర్వాత మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల