కర్నూలు, 28 సెప్టెంబర్ (హి.స.)నవరాత్రి ఉత్సవాలలో ఏడవ రోజు (సప్తమి తిథి) అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజుగా చెబుతారు. ఈ రోజున దుర్గాదేవి యొక్క అత్యంత ముఖ్యమైన రూపమైన శ్రీ మహాచండీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దేవి నవరాత్రుల్లో ఏడవ రోజున తెలుగు ప్రాంతాలలో కొన్ని చోట్ల శ్రీ చండీ దేవి లేదా మహా చండీ దేవి అమ్మవారిని అలంకరించి పూజించడం సంప్రదాయంగా ఉంది.
మహాచండీ దేవి పూజా విధానం:
మహాచండీ దేవి నవదుర్గలలో ఏడవ రూపం. అమ్మవారు నలుపురంగులో.. చెదరిన జుట్టుతో, మెడలో మెరుస్తున్న పుర్రెల దండతో, గాడిద వాహనంపై ఆసీనురాలై భయంకర రూపంలో దర్శనమిస్తుంది. అయితే.. భక్తులకు మాత్రం ఈమె ‘శుభంకరి’ (శుభాలను కలిగించే తల్లి)గా అభయం ఇస్తుంది.
నైవేద్యం యొక్క ప్రాముఖ్యత:
మహా చండీ దేవికి బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల శని గ్రహ దోషాలు తొలగిపోతాయని, జీవితంలో ఎదురయ్యే భయాలు, కష్టాలు, అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలు, ధైర్యం కలుగుతాయని భక్తులు నమ్ముతారు. బెల్లం సమర్పించడం ద్వారా అమ్మవారు భయాన్ని తొలగించి, శుభంకరిగా మారి సకల శుభాలను, శక్తిని ప్రసాదిస్తుంది.
ఏడవ రోజు పూజ విశిష్టత: నవరాత్రిలోని ఈ ఏడవ రోజు పూజ ద్వారా భక్తులు ప్రధానంగా శక్తి, ధైర్యం, రక్షణను కోరుకుంటారు. ఈ భయంకర రూపం అన్ని రకాల ప్రతికూల శక్తులు, దృష్టి దోషాలు, దుష్ట శక్తుల నుంచి తన భక్తులను రక్షిస్తుందని ప్రగాఢ విశ్వాసం. మహా చండీ దేవిని పూజించడం వల్ల అంతర్గత భయాలు, అపరాధ భావనలు తొలగిపోయి, జీవితంలో ధైర్యంగా ముందుకు సాగే మనోధైర్యం లభిస్తుంది. అందుకే.. ఈ సప్తమి రోజున నిష్టగా అమ్మవారిని పూజించి, బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పించి ఆశీస్సులు పొందడం ప్రతి భక్తుడి కర్తవ్యం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి