నిజామాబాద్,6 సెప్టెంబర్ (హి.స.)
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని పలు శాఖల పనితీరును నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యవసాయ, హౌసింగ్ కార్యాలయాలను సందర్శించి, ఆ శాఖల పనితీరును సమీక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలకు సంబంధించి రూపొందించిన నివేదికలు పరిశీలించారు. బాధిత రైతులకు ప్రభుత్వపరంగా సహాయం అందేలా పక్కాగా పంట నష్టం వివరాలు పొందుపర్చాలని సూచించారు. భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా పంట పొలాల్లో ఇసుక మేటలు వేసిందని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇసుక మేటలు తొలగింపజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు