
వాషింగ్టన్ డిసి, 10 జనవరి (హి.స.)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలకు, నిర్ణయాలకు ప్రస్తుతం కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయారు. గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను, యుద్ధ వాతావరణాన్ని తానే పరిష్కరించానని, చరిత్రలో నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)కి తనకంటే అర్హులు మరెవరూ లేరని ఆయన పేర్కొన్నారు. వెనిజులా చమురు నిల్వలపై చర్చించేందుకు వైట్హౌస్లో చమురు, గ్యాస్ ఎగ్జిక్యూటివ్లతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన ఏమీ చేయకుండానే నోబెల్ బహుమతిని పొందారని ఎద్దేవా చేశారు.
ప్రజలు తనను ఇష్టపడినా, ఇష్టపడకపోయినా తాను ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది పెద్ద యుద్ధాలను పరిష్కరించానని ట్రంప్ పునరుద్ఘాటించారు. 36 ఏళ్లు, 32 ఏళ్ల పాటు కొనసాగుతున్న దీర్ఘకాలిక యుద్ధాలకు సైతం ముగింపు పలికానని చెప్పారు. ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలయ్యే సమయానికి, అప్పటికే ఎనిమిది యుద్ధ విమానాలు (జెట్స్) కూల్చివేయబడ్డాయని, అటువంటి క్లిష్ట సమయంలో తాను జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై ప్రపంచంతో పాటు భారత దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV