
దిల్లీ, 26 ఫిబ్రవరి (హి.స.)
: అర్హులైన ఓటర్లుగా నిరూపించుకోవడానికి ప్రజలు పదో తరగతి ప్రవేశ (అడ్మిట్) కార్డు, ఉత్తీర్ణత ధ్రువీకరణనూ అనుబంధ పత్రంగా ఎన్నికల అధికారులకు సమర్పించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కసరత్తుకు సంబంధించి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీ ధర్మాసనం బుధవారం ఈ ఉత్తర్వు ఇచ్చింది. ఓటరు నమోదు అభ్యర్థనల్లో సహేతుక వ్యత్యాసాలు, తల్లిదండ్రుల పేర్లపై అభ్యంతరాలకు సంబంధించి వచ్చిన 80లక్షల క్లెయిమ్ల పరిష్కారానికి బెంగాల్లోని జిల్లా, సబార్డినేట్ జడ్జీలను కేటాయించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధర్మాసనం ఇది వరకే సూచించింది. అయితే, బెంగాల్లోని 250 మంది జిల్లా, సబార్డినేట్ జడ్జీలు సరిపోరని తెలపడంతో ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల న్యాయాధికారుల సహకారాన్నీ తీసుకోవాలని సీజేఐ ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై మరింత స్పష్టతనిస్తూ పదో తరగతి పత్రాలను ఓటర్ల గుర్తింపు నిర్ధరణకు అనుబంధ పత్రాలుగా పరిగణనలోకి తీసుకోవచ్చని బుధవారం వివరించింది. గురువారం సాయంత్రం 5 గంటల్లోగా వాటిని ఎన్నికల అధికారులకు అందజేయాలని పేర్కొంది. బెంగాల్లో సర్ కసరత్తు ఈ నెల 28వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఈ స్పష్టతనిచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ