
అమరావతి, /తాడేపల్లి27 ఫిబ్రవరి (హి.స.), : బ్రెయిన్డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవదానం చేసి నలుగురు జీవితాల్లో నూతన వెలుగులు నింపారు. పలువురికి స్ఫూరిప్రదాతగా నిలిచారు. గురువారం మణిపాల్ వైద్యశాల వైద్యులు ఈ వివరాలు వెల్లడించారు. విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన నీరుకొండ అజయ్కుమార్(48) ఈ నెల 23వ తేదీ రాత్రి గుణదల బస్ స్టాప్ వద్ద బస్సు దిగుతుండగా ప్రమాదానికిగురయ్యారు. ఈ ఘటనలో అతడి తలకు గాయం అయ్యింది. దీంతో స్థానికంగా ఉన్న వైద్యశాలలో చికిత్స చేయించారు. ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో 24వ తేదీ రాత్రి మణిపాల్ వైద్యశాలకు తీసుకొచ్చారు.
అజయ్కుమార్కు వైద్యులు పలు వైద్య పరీక్షలు చేసినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదు. అనంతరం 25వ తేదీ సాయంత్రం బ్రెయిన్డెడ్గా నిర్ధారించారు. అతని సోదరుడు సాంబశివరావు, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఏపీ జీవన్ధాన్ ఛైర్మన్ డాక్టర్ రాంబాబు, మణిపాల్ వైద్యశాల డైరెక్టర్ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో అజయ్కుమార్ అవయవాలు దానం చేశారు. కాలేయం, ఒక కిడ్నీ మణిపాల్ వైద్యశాలకు కేటాయించగా.. విజయవాడలో అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. మరో కిడ్నీ విజయవాడ కామినేని వైద్యశాలకు, కార్నియాను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. అవయవదానానికి ముందుకొచ్చిన దాత కుటుంబానికి మణిపాల్ వైద్యశాల కృతజ్ఞతలు తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ