
ఢిల్లీ, 28 ఫిబ్రవరి (హి.స.)
ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు
దేశవ్యాప్తంగా సుమారు 30కి పైగా కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్- అమెరికా వైమానిక దళాలు (Israeli-American Air Forces) ఉమ్మడిగా క్షిపణి దాడులకు దిగాయి. ఎవరూ ఊహించని రీతిలో జరిగిన ఈ మెరుపు దాడులతో టెహ్రాన్ సహా ఇతర నగరాలు బాంబుల మోతతో దద్దరిల్లాయి. ముఖ్యంగా సైనిక స్థావరాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడులు ఇరాన్ రక్షణ వ్యవస్థను గట్టిగా దెబ్బతీశాయి. మిలటరీ స్థావరాలే లక్ష్యంగా ఎటాక్స్.. లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ ఆపరేషన్, టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా కీలక నగరాల్లో ఈ దాడులు జరిగాయి. ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులతో ఇస్ఫహాన్ లో భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి.
ఈ దాడులపై ఇరాన్ ప్రభుత్వం (Government of Tran) అత్యంత ఘాటుగా స్పందించింది. తమ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన ఈ దాడికి ప్రతిదాడి భీకర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. యుద్ధాన్ని మీరు ప్రారంభించి ఉండవచ్చు.. కానీ దీని ముగింపు మాత్రం మా చేతుల్లోనే ఉంటుంది అని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. ఎవరూ ఊహించని రీతిలో ఈ యుద్ధానికి ముగింపు పలుకుతామని, ఇజ్రాయెల్ మరియు అమెరికా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇరాన్ దాడులు చేస్తుందని ముందే ఉహించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) నేరుగా పౌరుల సెల్ ఫోన్లకు అలర్ట్ సందేశాలను పంపుతూ, అందరూ సురక్షిత ప్రాంతాలకు (Protected spaces) సమీపంలో ఉండాలని ఆదేశించింది. క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలను ముందస్తుగా సిద్ధం చేసేందుకు ఈ 'ప్రోయాక్టివ్ అలర్ట్' జారీ చేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..