
న్యూఢిల్లీ, 02 మార్చి (హి.స.)
ఇజ్రాయిల్, అమెరికా-ఇరాన్
దాడులు, ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. యుద్ధవాతావరణం నేపథ్యంలో భారతదేశంలో మతపరమైన అల్లర్లు జరిగే అవకాశం ఉందని అందువల్ల అలర్ట్ గా ఉండాలని ఈ మేరకు కేంద్ర హోం శాఖ రాష్ట్రాల పోలీసు శాఖలకు లేఖ రాసింది. ముఖ్యంగా మతపరమైన సభలు, ప్రార్థనా స్థలాలలో ఇరాన్ అనుకూల రాడికల్ బోధకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే అవకాశం అటువంటి వాటిపై నిఘా ఉంచాలని ఆదేశించింది. దేశీయంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, గూఢచారి విభాగాల (intelligence sharing) మధ్య సమన్వయాన్ని పెంచి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.
భారత్లో నిరసనలపట్ల అప్రమత్తం:
ఖమేనీ మృతికి నిరసనగా భారత్ లోని ముఖ్యమైన నగరాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్, కర్నాటక, ఢిల్లీ, యూపీతో పాటు పలు ముఖ్యమైన నగరాల్లో ఖమేనీ మృతిపై ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలను ఆసరాగా చేసుకుని కొంత మంది హింసాత్మక ఘటనలకు దారి తీసేలా రెచ్చగొట్టే అవకాశం ఉందని, దీనిని అదుపు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్త వహించాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ గా ఉంది అక్కడి పరిస్థితులపై గత రాత్రి ప్రధాని మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమీక్షించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు