
హైదరాబాద్, 02 మార్చి (హి.స.)
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
(Rahul Gandhi) ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు బయట కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు శంషాబాద్ నుంచి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఒకే కారులో వికారాబాద్ కు బయలుదేరి వెళ్లారు. SAP ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో జరగనున్న పీసీసీ (PCC) రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్, రేవంత్ పాల్గొంటారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. .
ఆ తర్వాత అనంతగిరి (Ananthagiri) హిల్స్లోని హరిత హోటల్లో గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై, రెండు రాష్ట్రాల పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వికారాబాద్, అనంతగిరి హిల్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణకు రావడం, ముఖ్యంగా రెండు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ రాకతో కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు