
సౌత్ కొరియా, 21 మార్చి (హి.స.)
దక్షిణ కొరియాలో ఘోర అగ్ని ప్రమాదం
జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, 59 మంది గాయపడ్డారు. మరికొందరి ఆచూకీ తెలియడం లేదు. ఘటనకు సంబంధించి స్థానిక ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. డేజియోన్ పట్టణంలోని ఒక కార్ల విడిభాగాల తయారీ పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ప్రాథమిక అంచనా ప్రకారం ఒక పేలుడు కారణంగా మంటలు వేగంగా వ్యాపించి, అది భారీ అగ్నిప్రమాదానికి దారి తీసింది. అయితే, ఇంకా ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. పేలుడు జరిగిన సమయంలో పరిశ్రమలో 170 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ప్రదేశంలో సోడియం వంటి పలు హానికర కెమికల్స్ ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది మంటల్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. 59 మంది గాయపడ్డారు. ఇంకో నలుగురి ఆచూకీ తెలియడం లేదు. వివిధ ఫ్లోర్లలో కొందరి మృతదేహాల్ని గుర్తించారు. గాయపడ్డవారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా దాదాపు 500 మంది ఈ సహాయక సేవల్లో పాల్గొంటున్నారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని లీ జే మ్యుంగ్ అధికారులను ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..