
ముంబై, 29 మార్చి (హి.స.)భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రాండ్లలో ఒకటైన ‘రేమండ్’ (Raymond) గ్రూప్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన పారిశ్రామిక దిగ్గజం విజయపత్ సింఘానియా (87) ముంబైలో కన్నుమూశారు. విజయపత్ సింఘానియా కుమారుడు, గ్రూప్ ప్రస్తుత ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన గౌతమ్ సింఘానియా ఆయన మరణ వార్తను ఇన్స్టాగ్రామ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పంచుకున్నారు. సింఘానియా ముంబైలో మరణించారని, ఆయన అంత్యక్రియలు ముంబైలోని చందన్వాడి స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని తెలిపారు.
పద్మభూషణ్ పురస్కార గ్రహీత
పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయిన విజయపత్ సింఘానియా, ఒక నిష్ణాతుడైన పైలట్ కూడా, హాట్ ఎయిర్ బెలూన్లో అత్యధిక ఎత్తుకు చేరుకున్నందుకు ప్రపంచ రికార్డును కలిగి ఉన్నారు. ఆయన 2000 సంవత్సరం వరకు రెండు దశాబ్దాల పాటు రేమండ్ సంస్థకు ఛైర్మన్గా పనిచేశారు.
సైనిక దుస్తులతో మొదలైన ప్రయాణం:
రేమండ్ ప్రస్థానం 1925లో ఒక సాధారణ టెక్స్టైల్ మిల్గా ప్రారంభమైంది. అప్పట్లో ఈ మిల్లులో ప్రధానంగా భారత సైన్యం కోసం ఉన్ని దుస్తులను (Army Uniforms) తయారు చేసేవారు. 1980లో విజయపత్ సింఘానియా కంపెనీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేమండ్ రూపురేఖలే మారిపోయాయి. ఒక సాధారణ వస్త్ర వ్యాపారాన్ని ఆధునిక పారిశ్రామిక గ్రూప్గా ఆయన తీర్చిదిద్దారు.
‘ది కంప్లీట్ మ్యాన్’ – ఒక ఐకానిక్ బ్రాండ్
సాధారణ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రెడీమేడ్ దుస్తులు, ప్రీమియం సూటింగ్-షర్టింగ్ విభాగాల్లోకి రేమండ్ను విజయపత్ ప్రవేశపెట్టారు. 1958లో ముంబైలో రేమండ్ తన తొలి రిటైల్ షోరూమ్ను ప్రారంభించింది. “The Complete Man” అనే ప్రకటనల ప్రచారం ద్వారా రేమండ్ బ్రాండ్ దేశంలోని ప్రతి ఇంటికి చేరువైంది. అప్పట్లో మార్కెటింగ్ సంచలనం సృష్టించింది.
విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం:
నేడు రేమండ్ గ్రూప్ కేవలం వస్త్ర రంగానికే పరిమితం కాలేదు. విజయపత్ సింఘానియా దార్శనికతతో ఇది బహుముఖంగా విస్తరించింది. దేశవ్యాప్తంగా 600 నగరాల్లో 500 కంటే ఎక్కువ షోరూమ్లు విస్తరించి ఉన్నాయి. 20 వేలకు పైగా రంగులు, డిజైన్లలో వస్త్రాలను ఉత్పత్తి చేస్తోంది. రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్, FMCG రంగాలలో కూడా రేమండ్ తన ముద్ర వేసింది. ఈ గ్రూప్లో సుమారు 6500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద ‘వర్స్టెడ్ ఫ్యాబ్రిక్’ తయారీదారుగా రేమండ్ గుర్తింపు పొందింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV