
: మైలార్ దేవ్పల్లి , 05 మార్చి (హి.స.)కాటేదాన్ ప్రాంతంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాటేదాన్ లోని సుమిత్ టింబర్ డిపో, బి.డి. ప్లైవుడ్ గోదాములో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. టింబర్ డిపోలో నిల్వ ఉంచిన చెక్కలు, దుంగలు, కట్టెలకు మంటలు వేగంగా వ్యాపించడంతో క్షణాల్లోనే భారీగా వ్యాపించాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికులు మొదటగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ.. చెక్క సామగ్రి ఎక్కువగా ఉండటంతో వారు అదుపు చేయలేకపోయారు. భారీగా మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ జోన్ ఏసీపీ శ్రీనివాస్ అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రెండు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి చివరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఖచ్చితమైన నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక గోదాముల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు సరిగా పాటించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాటేదాన్ ప్రాంతంలో ఇటీవలి కాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ