
అమరావతి, 06 మార్చి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం (NDA Govt) పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) బాధ్యతలు చేపట్టి.. రాష్ట్రంలో అనేక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని అసెంబ్లీలో వెల్లడించారు. వట్టిచెరుకూరులో డిస్నీ ల్యాండ్ ఏర్పాటుపై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతం డిస్నీ ల్యాండ్ వంటి భారీ థీమ్ పార్కులు ప్రపంచవ్యాప్తంగా కేవలం మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మన రాష్ట్రంలో కూడా అటువంటి వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు.
పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం వండర్లా (Wonderla), ఇమేజికా (Imagica) వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోందని మంత్రి తెలిపారు. అయితే, డిస్నీ ల్యాండ్ వంటి భారీ ప్రాజెక్టులు రావాలంటే అక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య, వారు ఖర్చు చేసే శక్తి (Spending Capacity) వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయని ఆయన వివరించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఈ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV