తిరుమల కొండపై కార్చిచ్చు.. తప్పిన పెను ప్రమాదం
తిరుమల , 06 మార్చి (హి.స.) కలియుగదైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల కొండల్లో కార్చిచ్చు భగ్గుమంది. శుక్రవారం ఉదయం కాకులమాను దిబ్బ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విండ్ మిల్స్ పక్కనే ఉన్న అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. వేసవి ప్రా
తిరుమల


తిరుమల , 06 మార్చి (హి.స.)

కలియుగదైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల కొండల్లో కార్చిచ్చు భగ్గుమంది. శుక్రవారం ఉదయం కాకులమాను దిబ్బ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విండ్ మిల్స్ పక్కనే ఉన్న అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. వేసవి ప్రారంభం కావడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆకులు రాలి ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో తిరుమల కొండపై దట్టమైన పొగమంచు అలుముకుంది. ఈ కార్చిచ్చు సమాచారం అందుకున్న టీటీడీ, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

ఫైర్ సిబ్బంది 3 గంటలకు పైగా శ్రమించి.. మంటలను అదుపు చేసినట్లు తెలుస్తుంది. దీంతో తిరుమల కొండపై పెను ప్రమాదం తప్పినట్లైందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సాధారణంగా వేసవిలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయని స్థానికులు చెబుతున్నప్పటికీ, నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చే ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకొవడంపై టీటీడీ అప్రమత్తంగా ఉండాలని పలువురు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande