
అమరావతి 07 మార్చి (హి.స.)
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టిందని అంటున్నారు. అయితే కేంద్రం నియంత్రణ ఉన్న నేపథ్యంలో టీటీడీ పాలక మండలిలో కొత్త ఆందోళన చోటు చేసుకుంది. నిత్యం తిరుమల సన్నిధికి వేలాది మంది భక్తులు వస్తారు. అలాంటి తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపకూడదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ను కోరింది టీటీడీ పాలక మండలి.
లేదంటే అన్న ప్రసాదాల తయారీతో పాటు ఇతర అవసరాలకు చాలా ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంటుందని టీటీడీ పాలక మండలి లేఖ రాసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. టీటీడీ పాలక మండలిని ఆధ్యాత్మిక పరిధిలో ఉంచి సరఫరా కొనసాగించాలని ఈ సందర్భంగా లేఖలో కోరినట్లు తెలుస్తోంది. ఇక టీటీడీ లేఖ రాసిన నేపథ్యంలో IOCL కూడా సానుకూలంగానే స్పందించినట్లు చెబుతున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్, కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా పెంచింది. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ పై 60 రూపాయలు పెంచిన కేంద్రం, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పై 115 రూపాయలు పెంచింది. ఈ కొత్త ధరలు ఇవాల్టి నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. దీంతో హైదరాబాదులో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 965 కు చేరింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2076 కు చేరుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV