
కోల్కతా, 17 ఏప్రిల్ (హి.స.)
పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల వేళ రాజధాని కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరోసారి సోదాలతో కలకలం రేపారు. నగరంలోని ప్రముఖ ప్రాంతమైన మిడిల్టన్ స్ట్రీట్లో ఉన్న వ్యాపారవేత్త కేఎల్ ధనియా (KL Dhania) నివాసంలో ఈడీ అధికారులు ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు కొనసాగున్నట్లుగా తెలుస్తోంది. భారీ భద్రత నడుమ అధికారులు ధనియా నివాసంలోకి వెళ్లి ఆయనకు సంబంధించిన వ్యాపార పత్రాలు, బ్యాంక్ ఖాతాలు, హార్డ్ డిస్కులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మనీ లాండరింగ్ కోణంలో ఈ విచారణ సాగుతున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.
కాగా, గత కొంతకాలంగా కోల్కతాలో వరుసగా ఈడీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ధనియా నివాసంలో దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సోదాల్లో ఏవైనా కీలక పత్రాలు లేదా నగదు లభ్యమైందా అనే విషయాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV