
న్యూఢిల్లీ, 17 ఏప్రిల్ (హి.స.)
భారత పార్లమెంటు ఎగువ సభలో ఎన్డీయే తన పట్టును మరోసారి చాటుకుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికై అరుదైన రికార్డు సృష్టించారు. ఎన్డీయే తరపున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ ఆయన పేరును ప్రతిపాదించగా, విపక్షాల నుంచి ఎవరూ పోటీకి రాకపోవడంతో హరివంశ్ ఎన్నిక లాంఛనమైంది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ అధికారికంగా ప్రకటన చేయగానే సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ హరివంశ్ నారాయణ్ సింగ్ను అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. ఒక సాధారణ గ్రామం నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టి, జర్నలిజం రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, నేడు పార్లమెంటరీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న హరివంశ్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. సభను నిష్పక్షపాతంగా, హుందాగా నడపడంలో ఆయనకు ఉన్న నేర్పు పెద్దల సభకు ఒక అలంకారమని కొనియాడారు. కేవలం అధికార పక్షమే కాకుండా, విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సహా ఇతర సభ్యులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సభా మర్యాదలను కాపాడుతూ, అందరినీ కలుపుకుని పోతారనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ ఏకగ్రీవ ఎన్నికతో రాజ్యసభలో ఎన్డీయే వ్యూహం ఫలించినట్లయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi