
ఢిల్లీ, 20 ఏప్రిల్ (హి.స.)
సంస్కృతం భారతదేశానికి ఆత్మ వంటిదని, దేశ సాంస్కృతిక, నాగరికత కొనసాగింపునకు ఇది అత్యంత కీలకమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఇవాళ ఢిల్లీలో సంస్కృత భారతి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంస్కృతాన్ని ఆధునిక సంభాషణా మాధ్యమంగా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది.
ఈ కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ.. భారతదేశం కేవలం ఒక భౌగోళిక లేదా రాజకీయ అస్తిత్వం కాదు. ఇది ఒక సజీవ సంప్రదాయం. ఈ దేశ ఆలోచనా విధానానికి, జీవన సంస్కృతికి సంస్కృతమే మూలం. అందుకే సంస్కృతం కేవలం భాష కాదు, ఈ దేశపు ఆత్మ అని వివరించారు.
భాషను నేర్చుకునే పద్ధతిపై ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. పాఠశాలల్లో శ్లోకాలను బట్టీ పట్టించడం వల్ల చిన్నప్పుడు సంస్కృతం కష్టంగా అనిపించేది. కానీ, ఇంట్లో అదే భాషను సహజంగా మాట్లాడినప్పుడు సులువుగా ఉండేది. ఏ భాషనైనా నేర్చుకోవడానికి పుస్తకాలు కాదు, నిరంతర సంభాషణే అత్యంత సులభమైన, ఉత్తమమైన మార్గం అని సూచించారు. నిత్యం ఆ భాష మాట్లాడే వారి మధ్య ఉంటూ, వినడం, మాట్లాడటం ద్వారా భాష సులభంగా వస్తుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా సంస్కృతంపై మళ్లీ ఆసక్తిని పెంచడంలో సంస్కృత భారతి విజయం సాధించిందని భగవత్ ప్రశంసించారు. గత 15 ఏళ్లలో సమాజంలో సంస్కృతం పట్ల దృక్పథంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. కొత్త కార్యాలయం ఏర్పాటు సంతోషకరమే అయినప్పటికీ, అది పనికి కారణం కాదని, విస్తరించిన పనికి దక్కిన ఫలితమని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi