
న్యూ ఢిల్లీ, 23 ఏప్రిల్ (హి.స.)చైనీయులకు పర్యాటక వీసాలను పునరుద్ధరించాలని భారత్ నిర్ణయం తీసుకుంది. గల్వాన్ లోయలో 2020లో జరిగిన ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య టూరిస్ట్ వీసా సేవలు నిలిచిపోయాయి. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య మళ్లీ స్నేహం చిగురుస్తోంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
గత ఐదేళ్లుగా చైనీయులకు నిలిచిపోయిన పర్యాటక వీసాలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య 2025లో జరిగిన చర్చల తర్వాత.. సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి పలు ఆంక్షలను సడలించారు. వాటిలో భాగంగా నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభం, కైలాస మానస సరోవర్ యాత్ర పునరుద్ధరణ వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
తాజాగా చైనా, హాంకాంగ్ పౌరులకు పర్యాటక వీసాలను జారీ చేయడం కోసం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగు పడతాయని, టూరిజం రంగానికి కూడా ఊతం లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్