
శ్రీనగర్,23 ఏప్రిల్ (హి.స.) జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో టెర్రరిస్టులను ఏరివేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తాజాగా శ్రీనగర్ లోని హజరత్బల్ (Hazratbal) ప్రాంతంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, వారికి రవాణా, నిధుల రూపంలో సహాయం చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అరెస్టయిన వారిలో ముగ్గురు పురుషులతో పాటు ఓ మహిళ కూడా ఉన్నట్లుగా పోలీసులు ధృవీకరించారు. వీరంతా స్థానికంగా ఉగ్రవాదులకు రహస్య స్థావరాలను ఏర్పాటు చేయడంతో పాటు, భద్రతా దళాల కదలికలపై సమాచారాన్ని అందిస్తున్నట్లు విచారణలో తేలింది.
ఈ మేరకు నిందితుల స్థావరాలపై దాడులు నిర్వహించిన సమయంలో పోలీసులు భారీగా యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. అరెస్టయిన నిందితులు ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..