నితీశ్ కుమార్ను రాజకీయంగా బీజేపీ అంతం చేసింది: తేజస్వీ యాదవ్
నితీశ్ కుమార్ను రాజకీయంగా బీజేపీ అంతం చేసింది: తేజస్వీ యాదవ్
teju


పాట్నా: 24 ఏప్రిల్ (హి.స.)

బీహార్లోని అధికార ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. సుమారు రెండు దశాబ్దాల పాటు నితీశ్ కుమార్ నిర్వహించిన సీఎం పదవిని వదులుకునేలా ఒత్తిడి చేయడం ద్వారా బీజేపీ ఆయనను రాజకీయంగా సమాప్తం చేసిందని ఆరోపించారు. (Tejashwi Yadav) బీజేపీకి చెందిన సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకునేందుకు శుక్రవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన తేజస్వీ యాదవ్ ఈ సందర్భంగా సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సామ్రాట్ చౌదరికి అభినందనలు తెలిపారు.

కాగా, బీజేపీతో పాటు ఎన్డీయే మిత్రపక్షమైన జేడీ(యూ)పై తేజస్వీ యాదవ్ విమర్శలు గుప్పించారు. ‘నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగేందుకు బీజేపీ అనుమతించదని మాకు ముందే తెలుసు. 2030 వరకు ఎన్డీయే కూటమి నేతగా నితీశ్ కుమార్ ఉంటారని బీజేపీ పదే పదే చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడు వారు ఆయనను పూర్తిగా రాజకీయంగా అంతం చేశారు’ అని అన్నారు.

మరోవైపు బీహార్లో రాజకీయ వాతావరణం అస్థిరంగా మారిందని, ఐదేళ్లలో ఐదు ప్రభుత్వాలు మారాయని తేజస్వీ యాదవ్ విమర్శించారు. అలాగే నాయకత్వం చేతులు మారిన తీరుపై కూడా ఆయన మండిపడ్డారు. ‘ఎన్నికైన ముఖ్యమంత్రిని, ఎంపికైన ముఖ్యమంత్రి తొలగించారు’ అని ఎద్దేవా చేశారు.

కాగా, కొత్త సీఎం సామ్రాట్ చౌదరి ఆర్జేడీలో ఉన్న రోజులను తేజస్వి యాదవ్ సభకు గుర్తు చేశారు. ‘ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ శిష్యుడైన సామ్రాట్ చౌదరి ఎదుగుదల పట్ల నేను సంతోషంగా ఉన్నాను. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్లలో లోతైన మూలాలు కలిగినవారు, ఆయన ఎదుగుదలను అసూయపడే వారి పట్ల ఆయన జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు.

అలాగే సామ్రాట్ చౌదరి తండ్రి గతంలో చేసిన ప్రసంగాన్ని తేజస్వి యాదవ్ ప్రస్తావించారు. ‘నరేంద్ర మోదీని సజీవంగా పాతిపెడతానని శకునీ చౌదరి బెదిరించారు. అది బీజేపీ అగ్ర నాయకత్వాన్ని భయపెట్టినట్లుంది, అందుకే ఆయన కుమారుడిని ముఖ్యమంత్రిని చేసి శాంతింపజేసేందుకు ప్రయత్నించారు’ అని అన్నారు.

అయితే తేజస్వీ యాదవ్ వ్యాఖ్యలపై అధికార పక్షం నిరసన వ్యక్తం చేసింది. దీంతో సభకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. సీఎం సామ్రాట్ చౌదరి దీనిపై స్పందించారు. తేజస్వీ వాదనలను ఆయన తోసిపుచ్చారు. ‘నేను ఏ పాఠశాల నుంచీ రాలేదు. లాలూ యాదవ్ నన్ను జైలుకు పంపారు’ అని అన్నారు. అధికారం ఎవరి హక్కు కాదని నొక్కిచెప్పారు. బీజేపీ, ఎన్డీయేలే తన ఉన్నతికి కారణమని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande