
హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.)
మహిళలపై పెరుగుతున్న నేరాల అంశంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళల భద్రతపై ప్రధాని చేసే గొప్ప వ్యాఖ్యలు కేవలం ప్రదర్శన కోసం మాత్రమేనని ఆమె ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ జిల్లాలో జరిగిన చిన్నారి హత్య ఘటనను ప్రస్తావిస్తూ ప్రియాంక గాంధీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. మహిళలకు అన్యాయం జరిగిన ప్రతిచోటా బీజేపీ తన పూర్తి అధికారాన్ని ఉపయోగించి బాధితులను అణచివేస్తుందని ఆరోపించారు.
'గాజీపుర్ ఘటనలో కేసు పెట్టడానికి విముఖత చూపడం, ఆ తర్వాత బాధిత కుటుంబాన్ని బెదిరించడం, ప్రభావశీలులు కలకలం సృష్టించడం ఇవన్నీ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల తీవ్రతను చూపిస్తున్నాయి. బీజేపీ పాలనలో మహిళలపై అన్యాయం జరిగితే బాధితురాలినే మరింత వేధించే పరిస్థితి ఏర్పడింది. మహిళల గురించి ప్రధానమంత్రి చేసే గొప్ప ప్రకటనలు కేవలం ప్రదర్శన మాత్రమే. ఉన్నావ్ అత్యాచార, హత్రాస్, ప్రయాగ్రాజ్, గాజీపుర్ ఇలా ఎక్కడైతే మహిళలు అన్నాయానికి గురయ్యారో అక్కడ బీజేపీ తన పూర్తి అధికారాన్ని ఉపయోగించి నిందితుల పక్షాన నిలుస్తోంది. దేశవ్యాప్తంగా మహిళలు ఈ అంధకార పాలనను చూస్తున్నారు' అని ప్రియాంక గాంధీ ఆరోపించారు. గాజీపుర్లో ఏప్రిల్ 14న అదృశ్యమైన మైనర్ బాలిక ఏప్రిల్ 15న గంగా నదిపై ఉన్న వంతెన సమీపంలో శవమై కనిపించింది. ఇక ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi