
ఢిల్లీ 27 ఏప్రిల్ (హి.స.)మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీల భద్రత అంశం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం హర్భజన్ సింగ్కు కేటాయించిన భద్రతను ఉపసంహరించుకోగా, కేంద్ర ప్రభుత్వం వెంటనే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) భద్రతను కల్పించింది.
హర్భజన్ సింగ్, రాఘవ్ చద్దా సహా ఏడుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలు ఇటీవల బీజేపీలో చేరారు. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పంజాబ్ ప్రభుత్వం హర్భజన్ సింగ్కు కేటాయించిన 9-10 మంది పోలీసు సిబ్బందితో కూడిన భద్రతను శనివారం తొలగించింది. మరో ఎంపీ అశోక్ మిట్టల్కు ఉన్న భద్రతను కూడా వెనక్కి తీసుకుంది. మరోవైపు, శనివారం జలంధర్లోని హర్భజన్ సింగ్ నివాసం వద్ద ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పార్టీకి ద్రోహం చేశారంటూ నినాదాలు చేస్తూ, ఆయన ఇంటి ప్రహరీ గోడపై 'గద్దర్' (ద్రోహి) అని స్ప్రే పెయింట్తో రాశారు.
రాష్ట్ర ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకోవడం, నిరసనల నేపథ్యంలో ముప్పు ఉందని అంచనా వేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. వెంటనే రంగంలోకి దిగింది. హర్భజన్ సహా ఏడుగురు ఎంపీలకు పంజాబ్, ఢిల్లీలలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రత కల్పిస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.
పార్టీ ఫిరాయించిన ఈ ఏడుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్కు ఫిర్యాదు చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ ఎంపీలను 'ద్రోహులు'గా అభివర్ణించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi