
అమరావతి, 05 ఏప్రిల్ (హి.స.)
అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు లేదా చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు మనకు మొదట గుర్తొచ్చేది గోల్డ్ లోన్. కానీ ఇప్పుడు బంగారంలాగే మీ ఇంట్లో ఉన్న వెండిపై కూడా రుణం పొందే అవకాశం ఉంది. అయితే వెండిని తాకట్టు పెట్టే ముందు కొన్ని కీలక విషయాలు తెలియకపోతే మీరు నిరాశకు గురయ్యే అవకాశం. చాలా మంది తమ దగ్గర ఉన్న వెండి విలువ రూ.1 లక్ష ఉంటే, అంతే మొత్తం అప్పుగా వస్తుందని భ్రమిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వెండి మొత్తం విలువలో కేవలం 75శాతం నుండి 85శాతం వరకు మాత్రమే రుణంగా ఇస్తాయి. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు సేఫ్టీ మార్జిన్గా తమ వద్దే ఉంచుకుంటాయి. అంటే లక్ష రూపాయల వెండికి మీకు గరిష్టంగా రూ.85,000 మాత్రమే లభించవచ్చు.
బంగారంతో పోలిస్తే వెండి ధరలు మార్కెట్లో చాలా వేగంగా మారుతుంటాయి. ఈరోజు ఉన్న ధర రేపు ఉండకపోవచ్చు. ఒకవేళ వెండి ధరలు అకస్మాత్తుగా పడిపోతే బ్యాంకుకు నష్టం రాకూడదనే ఉద్దేశంతోనే రుణ సంస్థలు పూర్తి మొత్తాన్ని అప్పుగా ఇవ్వవు. భవిష్యత్తులో ధరలు తగ్గినా తమ అసలు సురక్షితంగా ఉండేలా బ్యాంకులు జాగ్రత్త పడతాయి.
బంగారం గ్రాము ధర వేలల్లో ఉంటే, వెండి ధర వందల్లోనే ఉంటుంది. కాబట్టి పెద్ద మొత్తంలో రుణం కావాలంటే మీ వద్ద చాలా ఎక్కువ పరిమాణంలో వెండి ఉండాలి. పైగా, ఒక వ్యక్తి నుండి ఎంత వెండి స్వీకరించాలి అనే దానిపై కూడా చాలా బ్యాంకులకు గరిష్ట పరిమితులు ఉంటాయి. వెండిపై రుణం తీసుకోవడం అనేది తక్షణ అవసరాలకు మంచి మార్గమే అయినప్పటికీ.. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర నిబంధనలను సరిచూసుకున్న తర్వాతే ముందడుగు వేయడం ఉత్తమం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV