ఆరుకిలోల బరువున్న శిశువు జననం
చాలా అరుదైన ఘటన జరిగింది. ఆరు కిలలో బరువుతో శిశువు జన్మిచింది.
ఆరుకిలోల బరువున్న శిశువు జననం


కోల్కతా, 05 ఏప్రిల్ (హి.స.)

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో చోటుచేసుకున్న ఓ అరుదైన వైద్య ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ మహిళ దాదాపు 6 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన వైద్యులనూ విస్మయానికి గురిచేసింది. సాధారణంగా నవజాత శిశువుల బరువు 2.5 కిలోల నుంచి 4.5 కిలోల మధ్య ఉంటుంది. కానీ, అందుకు భిన్నంగా ఇంత భారీ బరువుతో శిశువు పుట్టడం ప్రస్తుతం వైద్య వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

వివరాల్లోకి వెళితే.. కోల్కతాకు చెందిన 32 ఏళ్ల నాజియా పర్వీన్ అనే మహిళను ప్రసవం కోసం మార్చి 22న లేడీ డఫ్పరిన్ విక్టోరియా ఆసుపత్రిలో చేర్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ నివేదిత పాల్ పర్యవేక్షణలో ఆమెకు సిజేరియన్ ద్వారా ప్రసవం నిర్వహించారు. ఆ సమయంలో పుట్టిన శిశువు బరువు దాదాపు 6 కిలోలు ఉండటంతో వైద్య సిబ్బంది ఆశ్చర్యపోయారు. తల్లి అధిక బరువు, జన్యుపరమైన కారణాల వల్ల శిశువు ఇంత బరువుతో పుట్టి ఉండవచ్చని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

నాజియా పర్వీన్కు సుమారు పదేళ్ల క్రితం మొదటి సంతానం కలిగింది. అయితే, ఆ సమయంలో ఎలాంటి అసాధారణ పరిస్థితి లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని 'ఫీటల్ మ్యాక్రోసోమియా'గా పిలుస్తారు. గర్భధారణ సమయంలో తల్లికి డయాబెటిస్ ఉండటం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా భావిస్తారు. అయితే ఈ కేసులో కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande