
గయ, 16 మే (హి.స.)
గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన పవిత్ర భూమి గయ. ఆ తర్వాతే బిహార్లోని గయ ప్రాంతం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం చెందింది. తాజాగా గయ జిల్లాలోని దుబ్బా గ్రామంలో దాదాపు 1200 సంవత్సరాల కిందటి భారీ పురాతన బౌద్ధ మఠం అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక్కడ లభించిన అవశేషాల జాబితాలో మట్టిపాత్రలు, విగ్రహాలు, చిన్నసైజు బౌద్ధ స్థూపాలు ఉన్నాయి. ఈ అవశేషాలు బయటపడిన ప్రదేశంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలు లభించడం విశేషం. బోధ్గయ నుంచి సారనాథ్కు వెళ్లే ప్రాచీన బౌద్ధ యాత్రా మార్గంలో ఉన్న దుబ్బా గ్రామంలో బయటపడ్డ పురాతన అవశేషాల ఆసక్తికర వివరాలతో కథనమిది.
ఈ చారిత్రక అవశేషాలను గుర్తించడం అనేది రాత్రికి రాత్రి జరగలేదు. ఇందుకోసం సుదీర్ఘ కసరత్తు జరిగింది. దుబ్బా గ్రామంలోని ఈ నిర్దిష్ట ప్రదేశంలో పురావస్తు పరిశోధన, తవ్వకాల కోసం తొలుత సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఆర్కియాలజీ (సీఏబీఏ) నుంచి లైసెన్స్ తీసుకున్నారు. బోధ్గయలో ఉన్న మగధ విశ్వవిద్యాలయంలోని ప్రాచీన భారత, ఆసియా అధ్యయన విభాగం బృందానికి ఈ లైసెన్స్ లభించింది. ఆ వెంటనే మగధ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యుడు శంకర్ శర్మను ఈ పురావస్తు పరిశోధనకు డైరెక్టర్గా నియమించారు. ఆయన నేతృత్వంలోని పురావస్తు పరిశోధకుల టీమ్ నెల రోజుల పాటు దుబ్బా గ్రామంలో తవ్వకాలు, పురావస్తు పరిశోధన జరపాల్సిన నిర్దిష్ట ప్రదేశపు ఉపరితలాన్ని వెతికి, అత్యంత కచ్చితత్వంతో గుర్తించింది. చివరకు మే 9న ఆ ప్రదేశంలో తవ్వకాలను ప్రారంభించారు. ఇప్పటి వరకైతేే ఈ ఊరిలోని దాదాపు ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో తవ్వకాలు జరిపారు. తదుపరి దశలలో లోతైన రీసెర్చ్ కోసం తవ్వకాలు జరిపే ప్రదేశపు పరిధిని మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi