
హైదరాబాద్, 18 మే (హి.స.)
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఆయన కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణల వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర దాగి ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి వేరే పని లేనట్టు ఉందని, కేవలం బండి సంజయ్, ఆయన కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో రామచందర్ రావు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదు. ఒకవేళ ఆయన తప్పు చేస్తే పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కానీ, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సంజయ్ కుటుంబసభ్యులు ఒకవేళ ఏదైనా విషయంలో తప్పు చేస్తే, దాన్ని చట్ట ప్రకారం న్యాయపరంగా చూసుకుంటారు. దానికి రాజకీయ రంగు పూయాల్సిన అవసరం లేదుఅని రామచందర్రావు స్పష్టం చేశారు.
చట్టప్రకారం ముందస్తు బెయిల్ తీసుకోవడం అనేది ప్రతి పౌరుడి హక్కు అని, ఎవరూ ఇక్కడ పారిపోలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉందని, చట్టాన్ని గౌరవించి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఇప్పటికే సరెండర్ అయ్యాడని గుర్తుచేశారు. బీజేపీ నేతల ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ను వాడుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తోందని, ప్రజలు ఇలాంటి రాజకీయ కుతంత్రాలను గమనిస్తున్నారని రామచందర్ రావు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..